పారిస్: యూరోప్లో కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోని వారిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ వ్యూహాన్ని ప్రకటించిన ఆయన.. వ్యాక్సిన్ వేసుకోని వారి జీవితాలను కఠినతరం చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఫ్రాన్స్ పత్రిక లీ పార్సియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాక్సిన్ వేసుకోనివారిపై కఠినరీతిలో స్పందించారు. చాలా తీవ్రమైన రీతిలో ఆయన పదజాలాన్ని వాడారు. నిజంగా వ్యాక్సిన్ వేసుకోని వారిని ఇబ్బంది పెట్టాలని ఉందని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకునే వరకు ఆ పనిచేస్తూనే ఉంటానని మాక్రన్ వార్నింగ్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఘాటైన పదాలతో మాక్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అధ్యక్షుడి హోదాలో ఆ మాటలు మాట్లాడడం సరికాదన్నారు.
కోవిడ్ పాసులు జారీ చేయాలన్న ఉద్దేశంతో మాక్రన్ ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో ఓ బిల్లును తీసుకువచ్చింది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ఎంపీలు గళం విప్పారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని రెస్టారెంట్లు, బార్లు, సినిమాలకు రానివ్వకుండా ఉండేందుకు ఆ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తమకు బెదిరింపులు వస్తున్నట్లు ఆరోపించారు. బలవంతంగా వ్యాక్సిన్లు ఇవ్వమని, కానీ ప్రజాజీవితంలోకి రావాలంటే వ్యాక్సిన్లు తప్పనిసరి అని ఈ సందర్భంగా మాక్రన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని జైలుకు పంపమని, కానీ, జవనరి 15వ తేదీ నుంచి కోవిడ్ పాస్ లేకుంటే మాత్రం వారికి రెస్టారెంట్లు, సినిమాలు, పబ్లకు ఎంట్రీ కల్పించమన్నారు.