జొహన్నెస్బర్గ్: ఆగస్టులో తమ దేశంలో జరుగనున్న బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం చేశామని దక్షిణాఫ్రికా వెల్లడించింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఒక ప్రకటన చేశారు. వచ్చే నెలలో జరుగబోయే బ్రిక్స్ 15వ సదస్సుకు సౌతాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనున్నది. ఆ దేశ రాజధాని జొహన్నెస్బర్గ్లో జరిగే ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
కరోనా మహమ్మారి విజృంభన అనంతరం సభ్యదేశాల ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్ సమావేశం ఇదే. గత మూడేళ్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలో ఈసారి బ్రిక్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు.