Power Outage Across Pak | దాయాదిదేశం పాకిస్థాన్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీంతో కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఆయా నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ‘ఈ రోజు ఉదయం 7:34 గంటల సమయంలో నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో పవర్ గ్రిడ్ డౌన్ అయ్యింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం’ అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలు అంతకుముందే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ధ్రువీకరించాయని జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్డు, క్వెట్టాల నగరాల మధ్య విద్యుత్ సరఫరా చేసే రెండు లైన్లు ట్రిప్ అయ్యాయని, దీంతో సరఫరా నిలిచిపోయిందని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ వెల్లడించింది. బలూచిస్థాన్లోని 22 జిల్లాలకు విద్యుత్ సరఫరా ఆగిందని పేర్కొంది.
కాగా, పాక్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక రంగం కుదేలవడం, నిరుద్యోగం వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో పొదుపు మంత్రం పాటిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా విద్యుత్తు రంగంలో భారీగా పేరుకుపోతున్న రుణాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు కీలక ప్రతిపాదనలను ప్రకటించింది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పెండ్లి మండపాళ్లు రాత్రిపూట తెరిచి ఉంచడంపై ఆంక్షలు విధించింది. రాత్రి 8:30 గంటలకల్లా షాపింగ్ మాల్స్, రాత్రి పది దాటేలోగా పెండ్లి మండపాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లు, మ్యారేజీ హాళ్లు, షాపింగ్ మాల్స్ను రాత్రిపూట త్వరగా మూసేయడం ద్వారా దాదాపు రూ.6 వేల కోట్లు పొదుపు చేయొచ్చని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.