టెహ్రాన్, ఏప్రిల్ 26: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణించి ఉంటారన్న ప్రచారం మళ్లీ ఆ దేశంలో తెరపైకి వచ్చింది. మషాబాద్లో మొజ్తబా ఖమేనీ కుడ్య చిత్రాన్ని అధికారులు ఆవిష్కరించడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. యూఎస్-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం నేత, ఆయన తండ్రి అయతొల్లా ఖమేనీతో పాటు ఇతర నేతల చిత్రాల మధ్య మొజ్తబా చిత్రాన్ని పెద్దగా ఉంచడం చూస్తే ఆయన కూడా మరణించి ఉంటారన్న అనుమానాలు ప్రజల్లో ప్రబలుతున్నాయి. ప్రముఖులు మరణించినప్పుడు ఇలా పెద్ద సైజులో ఉన్న చిత్రపటాలను బహిరంగ ప్రదేశాల్లో ఆవిష్కరించి వారికి నివాళి ప్రకటించడం అక్కడ ఆనవాయితీ. అయితే కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ మరణం గురించి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ మీడియా కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.