Pro Palestine Protests | లాస్ ఏంజెల్స్, మే 2: అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అడ్డుకునేందుకు వర్సిటీల్లోకి పోలీసులు ప్రవేశించడంతో పోలీసులు – విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 17న కొలంబియా యూనివర్సిటీలో ఆందోళనలు ప్రారంభమై వివిధ విశ్వవిద్యాలయాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. గాజాలో తక్షణం కాల్పులు విరమించాలని, ఇజ్రాయెల్తో పాటు గాజాపై యుద్ధానికి మద్దతు ఇచ్చిన కంపెనీలతో యూనివర్సిటీలు సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసనకారుల శిబిరంపై బుధవారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు ఇజ్రాయెల్ మద్దతుదారులు దాడి చేశారు. శిబిరం వద్ద బారికేడ్లను తొలగించి, పేప్పర్ స్ప్రేను వెదజల్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి 15 మంది గాయపడ్డారు. తమపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని, సకాలంలో స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వర్సిటీలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులు పిలుపునివ్వగా విద్యార్థులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున వందలాది సంఖ్యలో పోలీసు బలగాలు వర్సిటీ క్యాంపస్ లోపలికి ప్రవేశించి బారికేడ్లు, శిబిరాలను తొలగించే ప్రయత్నం చేయడంతో విద్యార్థులు ప్రతిఘటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. టియర్ గ్యాస్ను, పేప్పర్ స్ప్రేను తట్టుకునేలా నిరసనకారులు సర్జికల్ మాస్క్లను, అద్దాలను ధరించారు. రబ్బర్ బుల్లెట్లను ఎదుర్కొనేందుకు ైప్లెవుడ్తో రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. హెల్మెట్లు ధరించారు. పోలీసులు స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. పలువురు విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకొని, నిరసన శిబిరాలను తొలగించారు. మరోవైపు పోర్ట్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, విస్కాన్సిన్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీల్లోనూ పోలీసులు 90 మంది నిరసనకారులను అరెస్టు చేసి నిరసన శిబిరాలను తొలగించారు. కాగా, ఇప్పటివరకు అమెరికాలోని 30 యూనివర్సిటీలు, కళాశాలల్లో దాదాపు 1,600 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వియత్నాంపై యుద్ధానికి వ్యతిరేకంగా దశాబ్దాల క్రితం జరిగిన ఆందోళనల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో అమెరికాలోని యూనివర్సిటీల్లో ఆందోళనలు జరగడం ఇదే మొదటిసారి. ఆందోళనల కారణంగా ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తాత్కాలికంగా మూతబడ్డాయి.
యూనివర్సిటీల్లో నిరసనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం స్పందించారు. ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలు అవసరమని, అయితే, ఇది శాంతిభద్రతలకు విఘాతం కలించేలా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. వర్సిటీల్లో నిరసనలు యుద్ధంపై, మధ్యప్రాచ్యంలో తమ విధానాలను మార్చుకునేలా, పునరాలోచించేలా ప్రేరేపించవని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటివరకు ఎంబసీని, కాన్సులేట్లను విద్యార్థులెవరూ సహాయం కోరలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. స్థానిక చట్టాలు, నిబంధనలను భారత పౌరులంతా గౌరవించాలని ఆయన కోరా రు. ప్రతి ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ, బాధ్యత, ప్రజాభద్రత, శాంతిభద్రతల మధ్య సమతుల్యత ఉండాలని పేర్కొన్నారు.