న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చదువుకునేందుకు వెళ్లి యుద్ధం కారణంగా స్వదేశానికి తిరుగ పయనమైన భారతీయ విద్యార్థులపై పోలెండ్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఉక్రెయిన్ నుంచి రోడ్డు మార్గాన పోలెండ్ సరిహద్దులకు వచ్చిన భారత విద్యార్థులపై అక్కడి పోలీసులు నేరగాళ్లలతో ప్రవర్తించినట్లుగా ప్రవర్తించారు. విద్యార్థులను క్యూలైన్లలో నిలబడుతూ ఎవరైనా పక్కకు జరిగితే కాళ్లతో తన్నారు.
కొంతమందిని క్రూరంగా మెడలు పట్టి నెట్టివేస్తున్న దృశ్యాలు టీవీల్లో, ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. మరికొందరిని కాళ్లు, చేతులు పట్టి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా వివిధ దేశాల పౌరులతోపాటు భారతీయులు కూడా ఆ దేశాన్ని వీడి స్వదేశాలకు వెళ్తున్నారు. ఆ క్రమంలో కొంతమంది భారతీయ విద్యార్థులు పోలెండ్ నుంచి ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చేందుకు రోడ్డు మార్గాన ఉక్రెయిన్ నుంచి పోలెండ్ సరిహద్దులకు చేరుకున్నారు.
అక్కడ జనం రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసులు సహనం కోల్పోయారు. ఆపదలో ఉన్నవాళ్లు అనే కనీస జాలి కూడా చూపకుండా వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆడవాళ్లు కాళ్లు మొక్కితేనే బార్డర్ దాటి రావాలని, మగవాళ్లు తాము చెప్పిన గేమ్ ఆడితేనే రావాలని పోలీసులు షరతులు పెట్టినట్లు బాధితులు తెలిపారు. కాగా, పోలెండ్ పోలీసుల దురుసు ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలెండ్ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.