దేశంలో ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ట్రక్కు డ్రైవర్లందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కెనడా సర్కార్ నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీనిని ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజులుగా తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రక్కు డ్రైవర్లు రాజధాని ఒట్టోవాను ముట్టడించారు. పరిస్థితి కూడా విషమించింది. ఏం చేయాలో పోలీసులకు కూడా పాలుపోవడం లేదు. దీంతో దేశంలో ఎమర్జెన్సీని విధించాలని ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, 30 రోజుల పాటు అమలులో వుంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కావని ప్రధాని జస్టిన్ ట్రూడో తేల్చి చెప్పారు. చట్ట వ్యతిరేకమైన, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే మాత్రం చూస్తూ ఊరుకోమని, అలాంటి వాటిని ఎంత మాత్రమూ ప్రోత్సహించేది లేదని ప్రకటించారు. అయితే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే మాత్రం తమకు ఎలాంటి ఇబ్బందుల లేవని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ట్రక్కులతో ఇలాగే నిరసనలకు దిగితే మాత్రం వారి వారి కార్పొరేట్ అకౌంట్లను నిషేధిస్తామని కెనడా సర్కార్ తీవ్రంగా హెచ్చరించింది.
కెనడాలో ట్రక్కు డ్రైవర్ల ఆందోళ
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ట్రక్కు డ్రైవర్లందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, వలసవాదులు కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించాలంటూ ప్రధాని జస్టిస్ ట్రూడో ఆదేశాలు జారీ చేశారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు రోడ్లపైకి ట్రక్కులతో సహా వచ్చి, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రజలు కూడా మద్దతు పలికారు. దీంతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. పరిస్థితి విషమించడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబం రహస్య ప్రదేశంలోకి కూడా వెళ్లిపోయింది.
50 ఏళ్ల తర్వాత ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్
దాదాపు 50 ఏళ్ల క్రితం ఇప్పటి ప్రధాని ట్రూడో తండ్రి పియర్రె ట్రూడో దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. అంటే 1970 లో పియర్రె ట్రూడో కూడా దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ప్రకటన చేశారు. అయితే ప్రధాని ట్రూడో తీసుకున్న ఈ నిర్ణయానికి పార్లమెంట్ కచ్చితంగా ఆమోదించాల్సి వుంటుంది. పార్లమెంట్ ఆమోదిస్తారా? లేదా? అన్నది చూడాలి. అయితే దేశంలో ఎమర్జెన్సీని విధించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.