న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం భారత్ చేరుకున్నారు. భారత పర్యటన సందర్భంగా బోరిస్ జాన్సన్ భారీ పెట్టబడుల ప్రణాళికను ప్రకటించారు. భారత్-బ్రిటన్ వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంలో నూతన ఒరవడికి నాంది పలుకుతామని అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను అధిగమించి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఊపందుకునేలా చర్యలు చేపడతామని చెప్పారు.
బ్రిటన్లో బిలియన్ పౌండ్ల పెట్టుబడులతో 11,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 5జీ టెలికాం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్యారోగ్య రంగంలో పరిశోధనల వరకూ పలు రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ పురోగతి సాధిస్తాయని అన్నారు. ఇక అంతకుముందు బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ ఆశ్రమంలో మహాత్మా గాంధీ వాడిన నూలు చరఖను బోరిస్ జాన్సన్ తిప్పారు.
ఈ సందర్భంగా ఆయన విజిటర్స్ బుక్పై సంతకం చేశారు. ఓ అసాధారణ వ్యక్తికి చెందిన ఆశ్రమాన్ని విజిట్ చేయడం గౌరవంగా భావిస్తానని, ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సత్యం, అహింసా సిద్ధాంతాలను గాంధీ ఎలా వాడరన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆ బుక్లో బోరిస్ రాశారు. గాంధీ రాసిన గైడ్ టు లండన్ అన్న పుస్తకాన్ని బోరిస్కు గిఫ్ట్గా ఇచ్చారు.