వాషింగ్టన్: 30 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. శాస్త్రవేత్తల కల సాకారమైంది. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలను పెంచాలన్న వారి లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. చంద్రుడి మట్టిలో నాసా సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు విజయవంతంగా మొక్కలను పెంచారు.
‘భూమిపై పెరిగే మొక్కల హార్మోన్లను, అంకురోత్పత్తి ప్రక్రియను చంద్రుడిపై ఉన్న మట్టి ప్రభావితం చేయలేదని తాజా ప్రయోగం రుజువుచేసింది’ అని ప్రొఫెసర్ అన్నా లీసా పౌల్ తెలిపారు. ‘చంద్రుడిపై మొక్కలను పెంచితే ఆక్సిజన్ ఉత్పత్తి సాధ్యమే. దీంతో ఆవాసాల ఏర్పాటు మరింత సులభమవుతుంది. అలాగే, భవిష్యత్తులో భూమి నుంచి చేపట్టే రోదసి మిషన్లను చంద్రుడి నుంచే ప్రారంభించవచ్చు. దీంతో రాకెట్ ఇంధనం ఖర్చూ కలిసొస్తుంది’ అని ప్రొఫెసర్ రాబ్ ఫెర్ల్ అన్నారు.