Ukraine war : రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే శత్రుదేశం మిస్సైల్, బుల్లెట్ దాడిలో దాదాపు లక్షమంది సైనికులు అమరులయ్యారు. చాలామంది గాయపడ్డారు. అయినా కూడా ఆ దేశ సైన్యం వెరవకుండా యుద్ధం చేస్తోంది. తాజాగా ముఖం నిండా రక్తంతో విజయ సంకేతం చూపిస్తున్న ఒక సైనికుడి సెల్ఫీ ఫొటోను డిసెంబర్ 5వ తేదీన ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో షేర్ చేసింది. ‘మేజర్ వాదిమ్ వొరోషిలోవ్.. మిగ్ యుద్ధ విమానం నడిపే ఇతను యుద్ధంలో రష్యాకు చెందిన 2 క్షిపణులు, ఇరాన్కు చెందిన 5 సూసైడ్ డ్రోన్లను నేలమట్టం చేశాడు. ముఖమంతా రక్తపు మరకలతో ఉన్నఅతని ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది’ అని రాసుకొచ్చింది.
అక్టోబర్ నెలలో మిగ్ యుద్ధ విమానం నుంచి రాత్రిపూట శత్రుదేశాల మిసైల్స్, డ్రోన్లను కూల్చే క్రమంలో వాదిమ్ వొరోషిలోవ్ తీవ్రంగా గాయపడ్డాడు. చివరి డ్రోన్ను నేలమట్టం చేస్తుండగా అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో అతనికి ముఖమంతా రక్తం అంటుకుంది. అయినా కూడా ముఖం మీద చిరునవ్వుతో విజయ సంకేతం చూపిస్తూ సెల్ఫీ దిగాడు. ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. యుద్ధంలో అతను చూపిన ధైర్య సాహసాల్ని ఆ దేశ ప్రజలు మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ వీర సైనిడికి హీరో ఆఫ్ ఉక్రెయిన్, ఆర్డర్ ఆఫ్ ది గోల్డ్ స్టార్ అవార్డులను ప్రకటించారు.