ఓ వ్యక్తి భోజనం చేసేందుకు రెస్టారెంట్కు వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. అక్కడ ఓ వింత ప్రదేశంపై అతడి కళ్లుపడ్డాయి. శిలాజాల అధ్యయనంపై ఆసక్తిగల ఆ వ్యక్తి అవి డైనోసార్ పాదముద్రలేమోనని భావించాడు. విషయాన్ని పరిశోధకులకు తెలియజేయగా, వారు వచ్చి పరీక్షించారు. ఆ పాద ముద్రలు వంద మిలియన్ ఏళ్లక్రితం జీవించిన ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్వేనని తేల్చారు. ఈ ఘటన చైనాలో జరిగింది.
ఓ హాంగ్టవో అనే వ్యక్తి ఇటీవల సిచువాన్ ప్రావిన్స్లోగల లెషాన్లోని ఒక రెస్టారెంట్ను సందర్శించాడు. అక్కడ అతడి కళ్లు ఓ అసాధారణ ప్రదేశంపై పడ్డాయి. ఆ ప్రదేశంలో ప్రత్యేకమైన గుంతలు కనిపించాయి. అవి డైనోసార్ పాదముద్రలుగా భావించిన అతడు పరిశోధకులకు ఈ విషయాన్ని తెలిపాడు. ఆ ప్రదేశాన్ని చైనా యూనివర్సిటీ ఆఫ్ జియోసైన్సెస్లోని పాలియోంటాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లిడా జింగ్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది.
ఈ బృందం 3డీ ప్రింటర్ను ఉపయోగించింది. బ్రోంటోసారస్ అనే జాతికి చెందిన రెండు డైనోసార్ల పాదముద్రలని తేల్చింది. ఇది అతిపెద్ద క్వాడ్రూప్డ్ సౌరోపాడ్ డైనోసార్ల జాతి అని గుర్తించారు. ఈ డైనోసార్లు145 నుంచి 66 మిలియన్ ఏళ్ల క్రితం క్రీటేషియస్ కాలంలో భూమిపై తిరిగినట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఆ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా డైనోసార్లు అభివృద్ధి చెందాయని భావిస్తున్నారు.
నాలుగు మందపాటి కాళ్లు, చాలా పొడవాటి మెడ కలిగి ఉన్న ఈ డైనోసార్లు ఇప్పటివరకూ ఉనికిలో ఉన్న అతిపెద్ద భూ జంతువులలో ఒకటిగా నమ్ముతారు. అవి 122 అడుగుల పొడవు, 70 టన్నుల బరువు కలిగి ఉన్నాయని అంచనా వేశారు. మూడు బస్సుల పొడవు, 10 ఆఫ్రికన్ ఏనుగుల బరువు ఉంటుందని భావిస్తున్నారు.