వాషింగ్టన్: అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ను పేల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిఘా బెలూన్ శకలాలను యూఎస్ నేవీ సేకరించింది. దానికి సంబంధించిన ఫోటోలను అమెరికా నౌకాదళం రిలీజ్ చేసింది. బోటులోకి భారీ స్థాయిలో బెలూన్ శిథిలాలను ఎక్కిస్తున్న ఫోటోలను యూఎస్ ఫ్లీట్ ఫోర్సెస్ కమాండ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది.సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్ వద్ద ఆ శకలాలను సేకరించారు.
చైనా బెలూన్లో ఎటువంటి నిఘా ఎక్విప్మెంట్ ఉందో ఆ శిథిలాల ఆధారంగా అమెరికా నిపుణులు అంచనా వేయనున్నారు. బెలూన్ దాదాపు 60 మీటర్ల ఎత్తులో ఎగిరిందని, దాంట్లో ఓ విమానంలో ఉన్నంత పేలోడ్ ఉందని, ఇక అది వేల పౌండ్ల బరువు ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రజల ప్రయోజనార్ధం ఆ బెలూన్ను రిలీజ్ చేశామని, కానీ అది అనుకోకుండా అమెరికా వైపు వెళ్లినట్లు చైనా చెబుతోంది.
అమెరికా గగనతలంలో బెలూన్ కనిపించిన తర్వాత.. ఆ దేశానికి చైనాకు మధ్య దౌత్యపరమైన వివాదాలు తలెత్తాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఉత్తర అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీంతో చైనా నిఘా బెలూన్ను అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు దేశ తూర్పుతీరంలో కూల్చివేసినట్లు పెంటగాన్ ప్రకటించింది.