మనీలా: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. భారత్లోనూ థర్డ్వేవ్ ఉధృతమైంది. ఫిలిప్పీన్స్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా మహమ్మారి ఉద్భవించింది మొదలు ఇప్పటివరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో అక్కడ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ రికార్డు స్థాయిలో 37,207 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అక్కడ కరోనా కాలుమోపిన తర్వాత ఇంత ఎక్కువగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
ఇవాళ్టి కేసులతో కలిపి ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 31,29,512కు చేరింది. అదేవిధంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,65,509కి పెరిగింది. అయితే పాజిటివిటీ రేటు మాత్రం గురువారం నాటి పాజిటివిటీ రేటుతో పోల్చితే కొంచెం తగ్గింది. గురువారం మొత్తం కరోనా పరీక్షలు చేసిన శాంపిల్స్లో 47.9 శాతం మందికి పాజిటివ్ రాగా.. శుక్రవారానికి అది 47.3 శాతానికి తగ్గింది. అదేవిధంగా గురువారం 81 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
దాంతో ఫిలిప్పీన్స్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,815కు చేరింది. అయితే శుక్రవారం మరో ఎనిమిది ల్యాబోరేటరీలు కొవిడ్ డాటాను అందించడంలో విఫలమయ్యాయి. ఆ డాటా కూడా లెక్కలోకి తీసుకుంటే ఇవాళ్టి కేసుల సంఖ్య మరింత ఎక్కువే ఉండేది. కాగా, కేసులు పెరుగడంతో అక్కడి ప్రభుత్వం రాజధాని మనీలాలో మరోసారి ఆంక్షలను కఠినతరం చేసింది.