న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న వ్యక్తిని చూసే సమయం ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ కొనసాగుతుండటం తెలిసిందే. 2024లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండో-అమెరికన్ కాంగ్రెస్మెన్ రో ఖన్నా (రోహిత్ ఖన్నా) పోటీచేయాల్సిందిగా బెర్నీ సాండర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ కీలక సభ్యులు, డెమోక్రటిక్ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన వార్తా వెబ్సైట్ ‘పొలిటికో’ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 79 ఏండ్లు. వచ్చే దఫా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీచేయడానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమల.. అధ్యక్షురాలిగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు అంతగా ఉండకపోవచ్చని కొందరు డెమోక్రటిక్ నేతలు భావిస్తున్నారు. దీంతో పార్టీలో కీలక నేతగా, చురుగ్గా వ్యవహరిస్తున్న రో ఖన్నా అధ్యక్ష పదవి రేసులోఉంటే మంచిదని సాండర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ సభ్యులు అభిప్రాయపడుతున్నట్టు ‘పొలిటికో’ వివరించింది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ బరి నుంచి తప్పుకొంటే ఖన్నా పోటీలో ఉండాలని పలువురు గట్టిగా పట్టుబడుతున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ ప్రతిపాదనను ఖన్నా సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు సమాచారం. 1976లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో రో ఖన్నా జన్మించారు. ఈయన తల్లిదండ్రులు పంజాబ్కు చెందినవారు. లాలా లజపత్ రాయ్తో కలిసి రో ఖన్నా తాతయ్య భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాలుపంచుకొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తరఫున ప్రచారం చేస్తూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన ఖన్నా.. ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బయోటెక్ ఎన్ఎస్సీగా ఖన్నా
నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఆన్ ఎమర్జింగ్ బయోటెక్నాలజీ (ఎన్ఎస్సీ-బయోటెక్నాలజీ) పోస్టుకు ఖన్నాను నామినేట్ చేస్తూ గురువారం బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకొన్నది.