Indra Nooyi | న్యూయార్క్, మార్చి 22: అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్న విద్యార్థుల హత్యలు, అదృశ్యం కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మన దేశ విద్యార్థులకు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి కీలక సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘ఈ మధ్య కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర సంఘటనల గురించి తెలిసింది. అందుకే ఈ వీడియో రికార్డు చేస్తున్నా. ఇక్కడి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. రాత్రి సమయంలో చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. అతిగా మద్యం సేవించకండి. ఇవన్నీ విపత్తుకు దారితీసేవే. అమెరికాకు వచ్చిన కొత్తలో స్నేహితులు, అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి.
కఠోర శ్రమ, విజయానికి భారతీయ విద్యార్థులు చిరునామా. అదే సమయంలో కొందరు డ్రగ్స్కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కెరీర్ పాడవుతుంది. వీసా స్టేటస్ గురించి తెలుసుకుంటూ ఉండండి. పార్ట్టైం ఉద్యోగం విషయంలో చట్టబద్ధతను తెలుసుకోండి. అమెరికాలో విదేశీ విద్యార్థిగా మీ హద్దులు గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. తాజాగా హైదరాబాదీ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ సహా పలువురు విద్యార్థులు కిడ్నాప్ కావటం, హత్యకు గురవటం వంటి కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా విద్యార్థులకు ఇంద్రానూయి జాగ్రత్తలు చెప్పారు.
అమెరికాలో 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసాల ప్రారంభ రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం వరకు పొడిగిస్తున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది. ఎంపికైనవారికి ఈనెల 31లోగా వివరాలను తెలియజేస్తామంది.