Israel-Hamas War | డీర్ అల్-బలహ్(గాజా స్ట్రిప్), అక్టోబర్ 29: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్నది. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో అక్కడ పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆహారం, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. ఆహార సంక్షోభం చుట్టుముడుతున్నది. ఈ క్రమంలో ఆదివారం వేలాది మంది ప్రజలు ఐక్యరాజ్యసమితి గోదాముల్లోకి చొరబడి ఆహార, ఇతర నిత్యావసర పదార్థాలను ఎత్తుకెళ్లారు. గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకర అంశమని, ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందనడానికి ఇది సంకేతమని ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం గాజా డైరెక్టర్ థామస్ పేర్కొన్నారు.
రెండో దశ యుద్ధం
గాజాపై రెండో దశ యుద్ధం ప్రారంభించామని.. హమాస్ సైనిక, ప్రభుత్వ సామర్థ్యాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. భూతల, గగన, జల మార్గాల ద్వారా దాడులు కొనసాగిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయల్ వద్ద బందీగా ఉన్న పాలస్తీనియన్లందరినీ విడిచిపెడితే తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిచి పెడతామని హమాస్ అగ్ర చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ సైన్యం తిరస్కరించింది. ఇప్పటి వరకు కాస్త సురక్షిత ప్రాంతంగా భావిస్తున్న ఉత్తర గాజాపైనా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.
సొంతసైన్యంపై నెతన్యాహూ విమర్శలు!
సొంత బలగాలను ఉద్దేశంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. హమాస్ దాడిని గుర్తించడంలో ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందని, దాడి గురించి భద్రతాధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై క్యాబినెట్ సహచరులు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవడంతో ఆయన భద్రతా బలగాలకు క్షమాపణలు చెప్పారు.