Biden-Trump | అమెరికా అధ్యక్షుడి మరోసారి ఎన్నికయ్యేందుకు బైడెన్ – ట్రంప్ ద్వయం సిద్ధపడుతుండగా.. వారిద్దరూ వద్దే వద్దని మెజార్టీ అమెరికన్లు బాహాటంగా చెప్తున్నారు. వచ్చే నెల 8 న జరగనున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అమెరికా రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికలు 2024 లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా పరిశీలకులు భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి రెండో సారి పోటీ చేసేందుకు బైడెన్, ట్రంప్ ఇద్దరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే, అక్కడి ప్రజలు మాత్రం వారు కాకుండా కొత్త వ్యక్తి అధ్యక్షుడిగా రావాలని కోరుకుంటున్నారు. హార్వర్డ్ సీఏపీఏ హ్యారిస్ సర్వేలో తేలిన అంశాల ప్రకారం 67 శాతం మంది ప్రజలు బైడెన్ పోటీ చేయకూడదని భావిస్తుండగా.. 33 శాతం మంది అతడ్ని బ్యాడ్ ప్రెసిడెంట్గా ముద్రవేశారు. అదేవిధంగా ట్రంప్ కూడా పోటీ చేయొద్దని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, బైడెన్, ట్రంప్ ఇద్దరూ మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనే తమ కోరికను పదేపదే బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నవంబర్ 8న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఎన్నికలు 2024 లో జరిగే ప్రెసిడెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్గా పరిగణిస్తున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్లపై ప్రజల్లో విశ్వసనీయత లేదనే సర్వేల్లో తేలుతున్నది. 2024 అధ్యక్ష ఎన్నికలలో వీరిని మరోసారి అమెరికా ప్రెసిడెంట్గా చూడాలని మెజార్టీ అమెరికన్లు ఇష్టపడటం లేదు. చాలా మంది ధర్డ్ ఆప్షన్ కోసం ఎదిరి చూస్తున్నారు. కాగా, న్యూస్ జెనరేషన్ ల్యాబ్.. యువతతో జరిపిన పోల్లో వీరిద్దరూ వద్దే వద్దని చెప్పారు. 73 శాతం మంది బైడెన్కు వద్దనగా.. 43 శాతం మంది ట్రంప్ మరోసారి పోటీ చేయొద్దని కోరారు. వీరిద్దరు వద్దంటే.. డెమోక్రాటిక్ పార్టీ తరఫున కమలా హారిస్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బుటెగీగ్, కాలిఫోర్నియా గవర్నర్ న్యూసోమ్ల పేర్లు తెరపైకి వస్తుండగా.. రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ డిసాంటిస్, మాజీ వైస్ప్రెసిడెంట్ మైక్ పెన్స్ పేర్లను యువత ముందుకు తెస్తున్నారు.