ఇస్లామాబాద్: చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రత ముప్పు ఉందంటూ టూర్నే రద్దు చేసుకున్న విషయం తెలుసు కదా. ఆ తర్వాత ఇంగ్లండ్ కూడా తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా ఈ క్రికెట్ సిరీస్ల రద్దుకు పాకిస్థాన్ ఓ వింత వాదన వినిపించింది. ఒకప్పుడు అమెరికాకు తాము నో చెప్పినందుకే, ఇప్పుడీ సిరీస్లు రద్దయ్యాయని చెప్పడం గమనార్హం.
ఈ రెండు క్రికెట్ సిరీస్లు రద్దు కావడంపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని కేబినెట్ మంగళవారం చర్చించింది. ఆ తర్వాత పాక్ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి దీనిపై మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్ ఆపరేషన్ల కోసం పాకిస్థాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటామని అమెరికా అడిగితే, కచ్చితంగా కుదరదు అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. దాని ఫలితంగానే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని ఫవద్ అన్నారు. దేశం తలెత్తుకొని నిలబడాలంటే ఈ మాత్రం మూల్యం చెల్లించడానికి సిద్ధమేనని చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్లో ఆపరేషన్ కోసం పాకిస్థాన్ భూభాగాన్ని అమెరికా ఉపయోగించుకోవడానికి తాను అనుమతించబోనని జులైలో ప్రధాని ఇమ్రాన్ అన్నారు. ఆ వ్యాఖ్యలను ఫవద్ ఇప్పుడు గుర్తు చేశారు. కచ్చితంగా కుదరదు అని చెప్పామంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇలాంటి మూల్యం చెల్లించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగానే ఉంది అని ఫదవ్ అన్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ తమ క్రికెట్ టూర్లను రద్దు చేసుకోవడం వల్ల ఒక్క పాకిస్థాన్ టెలివిజన్కే రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల నష్టం వచ్చినట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, వాళ్లను కోర్టుకు ఈడుస్తామని స్పష్టం చేశారు.