ఇస్లామాబాద్: గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఢీకొన్నాయి. (passenger train collides with goods train) ఈ ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం షేక్పురా జిల్లాలోని ఖిలా సత్తార్ షా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రధాన రైల్వే లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును, మియాన్వాలి నుంచి లాహోర్కు వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 31 మంది గాయపడినట్లు జియో న్యూస్ తెలిపింది. ప్రమాదాన్ని నివారించేందుకు లోకో పైలట్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయినట్లు పేర్కొంది.
కాగా, గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన విషయం తెలుసుకున్న పాకిస్థాన్ రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ లైన్లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి కారకులైన బాధ్యులపై చర్యలు చేపడతామని ఆ దేశ రైల్వే చైర్మన్ వెల్లడించారు.