ప్రతి 33 గంటలకు పేదరికంలోకి జారుకుంటున్న 10 లక్షలమంది
ధనికుల ఆదాయంలో ప్రతి 2 గంటలకు 7,700 కోట్లు పెరుగుదల
కరోనా సృష్టించిన ఆర్థిక అంతరమిది
ఆక్స్ఫామ్ నివేదికలో వెల్లడి
దావోస్, మే 23: ఊరు తగలబడుతుంటే ఆ మంటలతో చలి కాచుకొన్నట్టు.. కరోనా మహా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది దిక్కూ దివాణం లేకుండా చనిపోతుంటే, కొందరికి మాత్రం మృత్యఘోష కాసులు కురిపించింది. ఎంతలా అంటే.. రాత్రికి రాత్రే కుబేరులయ్యేలా మారింది. కొవిడ్-19 సంక్షోభం కొనసాగినంత కాలం ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ తయారయ్యాడు. ఆహారోత్పత్తులు, ఇంధన రంగ వ్యాపారాలు చేసేవారి సంపద ప్రతి రెండు గంటలకు ఏకంగా రూ.7,700 కోట్లకుపైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 33 గంటలకు పది లక్షల మంది కటిక పేదరికంలోకి జారుకొన్నారు. ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ పేరుతో ఆక్స్ఫామ్ అనే సంస్థ ఈ చేదు నిజాలను బయటపెట్టింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది.
దశాబ్దంలో పెరగాల్సిన రేట్లు రోజుల్లోనే..
కరోనా సమయంలో ఆహారం, ఇంధనం తదితర వస్తు సేవల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎంతలా అంటే దశాబ్దకాలంలో పెరగాల్సిన రేట్లు కొన్ని రోజుల్లోనే పెరిగిపోయాయని ఆక్స్ఫామ్ వెల్లడించింది. బిలియనీర్ల సంపద ఇంతలా పెరగటానికి వాళ్లు అతిగా కష్టపడటం ఏమాత్రం కారణం కాదని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచర్ తెలిపారు. ‘కార్మికులు దారుణమైన పరిస్థితుల్లో, అతి తక్కువ వేతనాలకు కష్టపడి పనిచేస్తున్నారు. ధనికులు ఏమాత్రం కనికరం లేకుండా వ్యవస్థను దశాబ్దాలుగా తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని ఇప్పుడు భారీగా ప్రయోజనాలు పొందుతున్నారు. గుత్తాధిపత్యం, ప్రైవేటీకరణ, కార్మికుల హక్కులను కాలరాయటం, పన్ను రహిత దేశాల్లో సంపద దాయటం ద్వారా వారు ప్రపంచమే నివ్వెరపోయేంత సంపదను సొంతం చేసుకొన్నారు. వీటికంతటికీ ప్రభుత్వాలే కారణం’ అని పేర్కొన్నారు.