Israel-Hamas War | జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధంతో పాలస్తీనా వాసులు హాహాకారాలు చేస్తున్నారు. తిండి, నీరు దొరక్క అల్లాడుతున్నారు. దవాఖానల్లో విద్యుత్తు లేకపోవడంతో అత్యవసర చికిత్సలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఈజిప్ట్, గాజా సరిహద్దులోని రఫా బోర్డర్ మూసివేయడంతో సహాయం అందడం లేదు. దవాఖానలు, పాఠశాలల్లో తలదాచుకున్న శరణార్థులకు రోజుకు ఒక లీటర్ నీరు మాత్రమే వారికి అందుతున్నది.
ఇప్పటివరకు 2750 మంది మృతిచెందినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఐస్క్రీమ్ ట్రక్కులే మార్చురీలుగా మారాయి. 10 లక్షల మంది ఇండ్లను వీడారు.
బందీలను విడిచిపెడితేనే దిగ్బంధంపై ఆలోచిస్తామని ఇజ్రాయెల్ చెబుతున్నది. మరోవైపు హమాస్ హెడ్ యహ్వా సిన్వార్ను హతమార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.
హమాస్ చెరలో 199 మంది బందీలుగా ఉన్నారు. బందీల వివరాలను ఆయా కుటుంబాలకు తెలిపినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ వెల్లడించారు. లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్పై మరోపారి దాడులకు దిగింది. లెబనాన్ సరిహద్దులోని పర్యవేక్షణ కెమెరాలను ధ్వంసం చేశారు. దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లోని గ్రామాలను ఇజ్రాయెల్ ఖాళీ చేయిస్తున్నది.
గాజా ఆక్రమణపై వెనక్కి తగ్గకపోతే రంగంలోకి దిగుతామని ఇరాన్ ఇజ్రాయెల్ను హెచ్చరించింది. కాగా, గాజా ఆక్రమణ అతిపెద్ద పొరపాటు కావొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు.
హమాస్కు మద్దతుగా తమపై దాడులకు దిగుతున్న ఇరాన్, హిజ్బొల్లాకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గట్టి హెచ్చరికలు చేశారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని స్పష్టంచేశారు.