ఇస్లామాబాద్: పాకిస్థాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. కరోనా సోకిన వారందరిపై దేవుడు కరుణ చూపాలని పేర్కొన్నారు. కరోనా టీకా తొలి డోసు తీసుకున్నానని, అయితే రెండో డోసు తర్వాత మాత్రమే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మరో వారం రోజుల్లో టీకా రెండో డోసు తీసుకోవాల్సి ఉన్న తరుణంలో కరోనా సోకినట్లు చెప్పారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కాగా, పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ఆయన భార్య సమినా అల్వి ఈ నెలలో చైనాకు చెందిన కరోనా టీకా సినోఫార్మ్ తొలి డోసు తీసుకున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య కూడా ఈ నెల 18న చైనా టీకా తొలి డోసు తీసుకున్నారు. అనంతరం రెండు రోజులకు వారిద్దరు కరోనా బారినపడి ఐసొలేషన్లో ఉన్నారు.