Pakistan : పాకిస్తాన్లో చమురు సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దేశంలో అవసరాలకు సరిపడా చమురు లభించడం లేదు. దీంతో గ్యాస్ వినియోగంపై కఠిన నిర్ణయాల్ని అమలు చేస్తోంది పాక్ ప్రభుత్వం. పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన కరాచీలో రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది.
అక్కడ ప్రభుత్వమే ఇండ్లకు ఎల్ఎన్జీని సరఫరా చేస్తోంది. గతంలో నిరంతరం గ్యాస్ సరఫరా జరిగేది. కానీ, ప్రస్తుతం రోజూ పరిమితంగా మాత్రమే గ్యాస్ సరఫరా అవుతోంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొద్దిసేపు మాత్రమే గ్యాస్ అందిస్తోంది. దీంతో చాలా మంది గ్యాస్ సరఫరా కోసం ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సరఫరా జరిగినప్పుడే వంటలు చేసుకుంటున్నారు. ఇక, రాత్రి 9 తర్వాత గ్యాస్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో రాత్రి 9 తర్వాత వంట చేసుకునేందుకు అవకాశం లేదు. ఈ లోపే వంట చేసుకుని తినాల్సి వస్తోంది. గ్యాస్ అందుబాటులో ఉన్న సమయంలోనే వంట పూర్తి చేసుకునేందుకు అక్కడి మహిళలు తంటాలు పడుతున్నారు.
త్వరగా వంట చేసుకుని తినకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం టీ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి గృహిణులు చెబుతున్నారు. గ్యాస్ సరఫరాకు అనుగుణంగా తమ షెడ్యూల్స్ మార్చుకోవడం అక్కడి వారికి కష్టంగా మారింది. భోజన వేళలు కూడా గ్యాస్ సరఫరాపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగితే, పాకిస్తాన్లో మరింత చమురు సంక్షోభం తప్పదు.