AFG vs PAK : అంతర్జాతీయ వేదికపై అమెరికా, ఇరాన్ (US, Iran) దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్న పాకిస్థాన్ (Pakistan).. తన సొంత సరిహద్దుల్లో మాత్రం అఫ్గానిస్థాన్ (Afghanistan) పై భీకర దాడులకు పాల్పడుతోంది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 35 మంది మరణించారు. మృతులంతా ఉగ్రవాదులేనని పాకిస్థాన్ వాదిస్తుండగా.. అమాయక పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అఫ్గానిస్థాన్ ఆరోపిస్తున్నది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైన్యం అనుసరించిన వివాదాస్పద ‘డబుల్ ట్యాప్ (Double tap)’ వ్యూహం తీవ్ర విమర్శలకు దారితీసింది.
సైనిక పరిభాషలో ‘డబుల్ ట్యాప్’ అంటే ఒకే ప్రదేశంపై కొద్ది సమయం వ్యవధిలో రెండోసారి దాడి చేయడం. దీన్ని అత్యంత క్రూరమైన, అమానవీయమైన వ్యూహంగా పరిగణిస్తారు. ఎందుకంటే మొదటి దాడి తర్వాత సహాయక చర్యల కోసం వచ్చే సిబ్బంది, వైద్యులు, పౌరులను లక్ష్యంగా చేసుకుని రెండో దాడి జరుపుతారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు పాకిస్థాన్ వైమానిక దళం ఫైటర్ జెట్లు అఫ్గానిస్థాన్లోని పక్తికా, పక్తియా, కునార్ జిల్లాల్లోని ఇళ్లు, మసీదులపై బాంబులు వేశాయి.
సరిగ్గా 25 నిమిషాల తర్వాత అంటే 12:55 గంటలకు శిథిలాల కింద చిక్కుకున్న మహిళలు, పిల్లలను కాపాడేందుకు గ్రామస్థులు పరుగెత్తుకురాగా.. పాకిస్థాన్ సైన్యం రెండోసారి బాంబుల వర్షం కురిపించింది. ఈ రెండో దాడితో మృతులు, క్షతగాత్రుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వందకుపైగా క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. గతవారం కరాచీలో తమ సైనిక దళాలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ నుంచి విడిపోయిన జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపామని, ఈ దాడుల్లో 29 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ తెలిపారు.
అయితే పాకిస్థాన్ వాదనను ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపందల చర్య అని, పాకిస్థాన్ దురాక్రమణకు పాల్పడిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మండిపడ్డారు. ఈ దాడుల్లో 35 మందికిపైగా అమాయక పౌరులు మరణించారని, వీరిలో 4 నుంచి 9 ఏళ్ల వయసున్న చిన్నారులు, వృద్ధులు ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్పై దాడి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఎలాంటి ఉగ్రవాదులు లేరని, సహాయక చర్యల్లో పాల్గొంటున్న మాపైనే రెండోసారి బాంబు వేశారని అన్నారు. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాకిస్థాన్ అబద్ధాలు చెబుతోంది” అని దాడిలో గాయపడిన ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తంచేశాడు.
కాగా అఫ్గానిస్థాన్లో 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్-అఫ్గాన్ సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయని, సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా.. తమ భూభాగంలో ఉగ్రవాదులు ఎవరూ లేరని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. గత 9 నెలల్లో పాకిస్థాన్ జరిపిన దాడుల్లో సుమారు 570 మంది అమాయక అఫ్గాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ శాంతిదూతగా వ్యవహరిస్తూ మరోవైపు పొరుగు దేశంపై దాడులకు పాల్పడటం పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని స్పష్టంచేస్తోంది.