ఇస్లామాబాద్, జూన్ 15: ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలకు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఓ సలహా ఇచ్చారు. టీ తాగడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా విదేశీ మారక నిల్వలు పడిపోతున్న సమయంలో దిగుమతి ఖర్చు భారం కొంత మేర అయినా తగ్గుతుందని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాక్లో టీపై వ్యయం స్థానిక కరెన్సీ ప్రకారం రూ.8,388 కోట్లుగా ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద టీ దిగుమతిదారుల్లో పాక్ ఒకటిగా ఉన్నదని, టీ దిగుమతులకు రుణాలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి ఇక్బాల్ అన్నారు. ఈ నేపథ్యంలో టీ తాగడాన్ని 1-2 కప్పులు తగ్గించుకోవాలని కోరారు.