కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వైదొలగడంతో ఆ దేశం మరోసారి పూర్తిగా తాలిబన్ల వశమైంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. దేశాన్ని వీడక ముందు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి తెలిపారు. జూలై 23న జో బైడెన్తో చివరిసారి ఫోన్లో మాట్లాడారు. తాలిబన్లు ఒంటరి కాదని, పాకిస్థాన్ ఉగ్రవాదులు వారికి సహకరిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు సుమారు 10,000 నుంచి 15,000 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు తమ దేశంలో ఉన్నారని బైడెన్తో అన్నారు.
‘మిస్టర్ ప్రెసిడెంట్, మేము పూర్తి స్థాయి దండయాత్రను ఎదుర్కొంటున్నాము. తాలిబన్లకు పాకిస్థాన్ పూర్తి ప్లానింగ్, లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తున్నది. కనీసం 10 వేల నుంచి 15 వేల మంది అంతర్జాతీయ ఉగ్రవాదులు, ప్రధానంగా పాకిస్థానీ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్లో ఉన్నారు. కాబట్టి ఆ కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దీనిపై వేగంగా స్పందించాలి’ అని బైడెన్తో ఘనీ అన్నారు. వారిద్దరి మధ్య చివరిసారి సాగిన ఈ 14 నిమిషాల ఫోన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ను రాయిటర్స్ వార్తా సంస్థ యాక్సెస్ చేసింది. ఇరువురి మధ్య జరిగిన సంభాషణను ప్రామాణీకరించింది.
కాగా, ఎయిర్ సపోర్ట్ అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఘనీ ప్రభుత్వానికి తాలిబన్ల వల్ల వెంటనే ముప్పు ఉండబోదని అన్నారు. దీంతో తాలిబన్లను ఎదుర్కొంటామని, సైన్యాన్ని మళ్లిస్తున్నామని తర్వాత రోజు ఘనీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. అయితే, అనంతరం మూడు వారాల్లోనే తాలిబన్లు ఆగస్ట్ 15న కాబూల్లోకి ప్రవేశించడం బైడెన్తో పాటు ప్రపంచం నివ్వెరబోయింది. దీంతో చేసేదేమీ లేక అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు.