భారత్తో చర్చల విషయమై పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. భారత్తో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు చేద్దామంటే అందుకు అనువైన వాతావరణం లేదని పాక్ పేర్కొంది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆసీమ్ ఇఫ్తికార్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్- పాక్ మధ్య వాణిజ్య సంబంధాలను తిరిగి పునరుద్ధరించాలని పాక్ కేబినెట్ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఢిల్లీలో ప్రత్యేకంగా పాక్ తరపున ఓ వాణిజ్య మంత్రిని కూడా నియమిస్తామని ప్రకటించింది. ఇలా చేయడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యానికి తెరలేపినట్లేనా? అని విలేకరులు అడిగారు.
ఈ విషయంపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఈ విషయంలో తాము ఓ ఏకాభిప్రాయానికి వచ్చామనే వెల్లడించారు. అయితే.. భారత్తో ఉన్న వివాదాలకు శాంతిపూర్వకంగా సమాధానం దొరకాలని భావిస్తున్నామని, ఈ విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వపు విధానాలనే తామూ అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు.