ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaz Sharif) మళ్లీ స్వదేశానికి వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన తన స్వంత దేశంలో ల్యాండ్కానున్నారు. మూడు సార్లు పాకిస్థాన్ ప్రధానిగా చేసిన నవాజ్ షరీఫ్.. నాలుగేళ్లు స్వదేశానికి దూరంగా ఉన్నారు. ఓ అవినీతి కేసులో ఆయన్ను దోషిగా తేలుస్తూ రాజకీయాల నుంచి జీవితకాలం వేటు వేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మళ్లీ రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దుబాయ్లో కొన్నాళ్లు చికిత్స పొందిన ఆయన .. ఇవాళ ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఈ మంగళవారం వరకే ఓ కేసులో షరీఫ్కు ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అవినీతి కేసులో ఏడేళ్ల శిక్ష పడగా, ఆయన ఒక సంవత్సరం కన్నా తక్కువ సమయమే జైలులో ఉన్నారు. వైద్య చికిత్స కోసం తొలుత లండన్ వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎన్ని ఆదేశాలిచ్చినా..షరీఫ్ మాత్రం తిరిగి రాలేదు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండడంతో.. తిరిగి నవాజ్ షరీఫ్ స్వదేశానికి వస్తున్నారు.