ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. తోషాకానా-2 అవినీతి కేసులో ఈ శిక్ష విధించారు. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ప్రత్యేక కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 2021లో సౌదీ ప్రభుత్వం అందజేసిన కానుకలను ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా అక్రమంగా వాడుకున్నట్లు తెలిసింది. ఆ ఘటనపై తోషాకానా కేసు నమోదు చేశారు. స్పెషల్ కోర్టు జడ్జీ షారూక్ అర్జుమంద్ ఇవాళ తీర్పును వెలువరించారు. రావల్పిండిలోని హైసెక్యూర్టీ ఉన్న అదియాలా జైలులో తీర్పును ఇచ్చారు. పాకిస్థాన్ శిక్షా స్మృతిలోని సెక్షన్ 409 కింద ఇమ్రాన్, ఆయన భార్య బుష్రాకు పదేళ్ల శిక్ష వేశారు. ఇక అవినీతి చట్టం కింద మరో ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. ఆ దంపతులకు అదనంగా ఒక్కొక్కరిపై 10 మిలియన్ల జరిమానా కూడా విధించారు.
సౌదీ చక్రవర్తి బల్గేరి జ్వలరీ సెట్ను ఇమ్రాన్కు గిఫ్ట్గా ఇచ్చారు. మే 2021 అధికారిక పర్యటన సమయంలో ఆ బహుమతి అందజేశారు. అయితే ఆ ఖరీదైన గిఫ్ట్ను ఇమ్రాన్ తక్కువ ధరకే అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఒవకేళ జరిమానా చెల్లించకుంటే అప్పుడు ఇమ్రాన్,బుష్రాలకు అదనపు జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఇమ్రాన్, బుష్రా లీగల్ బృందాలు పేర్కొన్నాయి. తనపై అక్రమ కేసు పెట్టినట్లు ఇమ్రాన్ వాదించారు.