ఇస్లామాబాద్/కాబూల్ : నిన్న మొన్నటి వరకు దాడులు, ప్రతిదాడులకే పరిమితమైన పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ దేశాలు ఇప్పుడు ముఖాముఖీ యుద్ధానికి దిగాయి. అఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నట్టు పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజ ఆసిఫ్ శుక్రవారం ప్రకటించారు. అఫ్ఘాన్ ప్రధాన నగరాల్లో శుక్రవారం పాక్ వైమానిక దాడులకు దిగింది. కొన్ని నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్టు ఆ దేశ మీడియా నిర్ధారించింది. ఇప్పటికే ఇరు దేశాల్లోనూ వందలాది మంది మరణించినట్టు వార్తలొస్తున్నాయి. తాము చేసిన దాడుల్లో 133 మంది తాలిబన్ ఫైటర్లు మరణించగా, 200 మంది గాయపడ్డారని, 27 పోస్ట్లు ధ్వంసం అయ్యాయని, 9 మందిని బందీలుగా పట్టుకున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే 55 మంది పాక్ సైనికులను తాము హతమార్చామని, 19 పోస్ట్లను స్వాధీనం చేసుకున్నామని, తమకు చెందిన 8 మంది ఫైటర్లు మరణించారని అఫ్ఘాన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘మా సహనం హద్దులకు చేరుకుంది. ఇక మా మధ్య, మీ మధ్య ప్రత్యక్ష యుద్ధమే’ అని పాక్ మంత్రి ఖవాజ ఆసిఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ సమగ్రత, శాంతి విషయంలో తాము ఎంతమాత్రం రాజీపడబోమని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. కాగా, గురువారం అర్ధరాత్రి అఫ్ఘాన్ చేపట్టిన సరిహద్దు దాడులకు ప్రతీకారంగానే తాము ఈ సైనిక చర్య చేపట్టామని అధికారులు తెలిపారు. దీంతో కొన్ని తాలిబన్ పోస్ట్ల వద్ద రాజీకి చిహ్నంగా తెల్ల జెండాలు ఎగురవేశారని పాకిస్థాన్ మీడియా తెలిపింది. తమ వైమానిక, సైనిక దళాలు సరిహద్దు వెంబడి ఉన్న తాలిబన్ సైనిక పోస్ట్లు, హెడ్క్వార్టర్స్, ఆయుధ డిపోలు లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నాయని మంత్రి చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దు దళాలపై అఫ్ఘాన్ ఫైటర్స్ చేసిన దాడికి తగిన సమాధానంగా ఈ మిలిటరీ చర్య చేపట్టినట్టు పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య వైమానిక దాడులు, సరిహద్దు దాడులు కొన్ని నెలలుగా జరుగుతున్నాయి.
కాబూల్, కాందహార్లలో జెట్ విమానాలు తిరిగాయని, పలు చోట్ల భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని ఏఎఫ్పీ నివేదించింది. కాగా, తమపై పాక్ వాయుసేన దాడులను అఫ్ఘాన్ తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ నిర్ధారించారు. అయితే ఎలాంటి మరణాలు సంభవించ లేదని ఆయన తెలిపారు. తమపై పాకిస్థాన్ దాడులపై మండిపడుతున్న అప్ఘాన్ ఆ దేశానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని ప్రకటించింది. ఇప్పటికే సూసైడ్ స్కాడ్ను సిద్ధం చేసినట్టు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ న్యూస్ ఏజెన్సీలు సూసైడ్ అటాకర్ల బెటాలియన్ ఫొటోను షేర్ చేశాయి. ఇప్పటికే పాకిస్థాన్ సరిహద్దులోని డ్యూరాండ్ రేఖ వద్ద తమ బలగాలు ప్రతీకార చర్యలను ప్రారంభించారని తాలిబన్ల డిప్యూటీ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాట్ తెలిపారు.