ఇస్లామాబాద్ : తీవ్ర ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఆర్ధిక క్రమశిక్షణను పాటించేలా పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఎంపీలకు ఇచ్చే వేతనాల కోత నుంచి విదేశీ టూర్లు, లగ్జరీ వాహనాల కొనుగోలు వరకూ దుబారా ఖర్చులకు కళ్లెం వేయాలని నిర్ణయించింది. ఇక తన ఆర్ధిక సమతుల్యతను కాపాడుకునేందుకు పాకిస్తాన్ అమెరికా సాయాన్ని అర్ధించింది. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటాయనే భయంతో ఐఎంఎఫ్తో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికీ పాకిస్తాన్ వెనుకడుగు వేస్తోంది.
పాకిస్తాన్కు రుణ సాయం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఐఎంఎఫ్ను ఒప్పించాల్సిందిగా పాకిస్తాన్లో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధి బృందాన్ని పాక్ ఆర్ధిక మంత్రి ఇషాఖ్ దర్ కోరారు. వరదలతో పాటు ఆర్ధిక మాంద్యం విసిరిన సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతినిధి బృందానికి విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ ఒప్పందాలన్నింటికీ పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందని దేశంలో ఆర్ధిక సుస్ధిరత కోసం కఠిన చర్యలు చేపడుతుందని ఆయన అమెరిన్ బృందానికి హామీ ఇచ్చారు. ఇక ఆర్ధిక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా దుబారాకు కత్తెర వేసేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది.
సహజవాయువు, విద్యుత్ ధరల పెంపు
నిఘా సంస్ధలకు విచక్షణారహిత నిధుల కేటాయింపు నిలిపివేత
సైనిక, పౌర అధికారులకు కేటాయించిన ప్లాట్లను వెనక్కితీసుకోవడం
ఎంపీల వేతనంలో 15 శాతం కోత, అలవెన్సుల రద్దు
ప్రీపెయిడ్ విద్యుత్, గ్యాస్ మీటర్ల ఏర్పాటు
అన్ని స్ధాయిల్లో పెట్రోల్ వాడకం 30 శాతం తగ్గింపు
విదేశీ టూర్లు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం