బెర్లిన్: జర్మనీలో కరోనా బెంబేలెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే ఆ దేశంలో లక్షా 12 వేల 323 కేసులు నమోదు అయ్యాయి. 239 మంది కరోనాతో మరణించినట్లు రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆ దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ దూసుకెళ్లుతోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. జర్మనీతో పాటు అన్ని యూరోప్ దేశాల్లోనూ ప్రస్తుతం ఒమిక్రాన్ వేవ్ నడుస్తోంది. రోజువారి కేసుల సంఖ్య భారీ స్థాయిగా పెరుగుతోంది. వ్యాక్సినేషన్ జరిగిన ప్రదేశాల్లోనూ కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తూనే ఉన్నది.
జర్మనీలో ప్రస్తుతం కరోనా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే ఆ ఆంక్షలను ఎత్తివేయాలని సోమవారం భారీ స్థాయిలో ర్యాలీలో జరిగాయి. బెర్లిన్తో పాటు పలు నగరాల్లో నిరసనకారులు ప్రభుత్వ ఆంక్షలకు వ్యతిరేకంగా గళం విప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ర్యాలీల్లో సుమారు 70 వేల మంది పాల్గొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రోస్టాక్, కాట్బస్ నగరాల్లో ఆందోళనకారులు మాస్క్లు లేకుండానే గుమ్మిగూడారు. వ్యాక్సిన్ పాస్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసనకారులు తప్పుపడుతున్నారు.