ఇస్లామాబాద్: వివాహ వివాదం (marriage dispute) నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది నిద్రిస్తుండగా బంధువులు కాల్చి చంపారు. పొరుగు దేశమైన పాకిస్థాన్లో ఈ దారుణం వెలుగుచూసింది. వాయువ్య పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని వారి బంధువులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోకి చొరబడిన కొందరు వ్యక్తులు నిద్రిస్తున్న వారిపై తుపాకులతో కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ సంఘటనలో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులతో సహా ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించినట్లు తెలిపారు. మలాకాండ్ జిల్లాలోని బత్ఖేలా తహసీల్లో ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. ఈ హత్యలకు పెళ్లి వివాదం కారణమని వెల్లడించారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పారామిలటరీ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే హంతకులు తప్పించుకోకుండా ఆ జిల్లాలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ముహమ్మద్ ఆజం ఖాన్ ఈ సంఘటనపై స్పందించారు. నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. వారిని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.