ఇస్తాంబుల్: దక్షిణ టర్కీ కేంద్రంగా సోమవారం తెల్లవారుజామున అత్యంత శక్తివంతమైన భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. అయితే ఆ తర్వాత కూడా బలమైన భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. కనీసం 18 సార్లు భూమి రిక్టార్ స్కేల్పై 4 తీవ్రత కన్నా ఎక్కువ తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. టర్కీలోని ఘజియాన్టెప్ ప్రావిన్సులోని నుర్దగి కేంద్రంగా భూకంపం సంభవించింది.
టర్కీ, సిరియాను భూకంపం అతలాకుతలం చేసింది. చీకట్లో సంభవించిన భూకంపం వల్ల ఇప్పటి వరకు 500 మంది మరణించారు. సుమారు 3 వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే భూప్రకంపనల్లో ఏడుసార్లు రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5 కన్నా ఎక్కువగా నమోదు అయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
భూకంపం వచ్చిన 11 నిమిషాల తర్వాత మరో బలమైన ప్రకంపన వచ్చిందని, అది రిక్టార్ స్కేల్పై 6.7 తీవ్రతగా ఉందని యూఎస్జీఎస్ పేర్కొన్నది. అయితే రాబోయే మరికొన్ని గంటల్లోనూ శక్తివంతమైన ప్రకంపనలు ఉండనున్నట్లు జియోలాజికల్ సర్వే ప్రకటించింది
భూకంపం ఎంత శక్తివంతంగా ఉందంటే.. ఆ తీవ్రత వల్ల ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల్లోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. వందేళ్ల క్రితం కూడా టర్కీ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం నమోదు అయ్యింది. 1939లో ఈస్ట్రన్ టర్కీలో సంభవించిన భూకంపం వల్ల సుమారు 30 వేల మంది మరణించారు.
టర్కీలో 284 మంది మృతిచెందగా, 2300 మంది గాయపడినట్లు వైస్ ప్రెసిడెంట్ ఫౌట్ ఓక్టే తెలిపారు. సిరియాలో 237 మంది మరణించారని, 639 మంది గాయపడ్డారని ఆ దేశానికి సనా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.రెండు దేశాల్లో ప్రస్తుత మృతుల సంఖ్య 521 దాటింది. రెండు దేశాల్లో 1700 బిల్డింగ్లు ధ్వంసం అయినట్లు టర్కీ ఉపాధ్యక్షుడు తెలిపారు.