కాబూల్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లి అస్తవ్యస్తంగా మారిన ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ఇప్పటికీ 200 మందికిపైగా భారతీయులు చిక్కుకుపోయారు. వాళ్లను రక్షించడానికి అక్కడికి వెళ్లిన విదేశాంగ శాఖ సిబ్బంది, పారామిలిటరీ సైనికులను కూడా అక్కడి నుంచి వెనక్కి తీసుకురావాల్సి ఉంది. వీళ్లను తీసుకొచ్చే విమానం కాబూల్ ఎయిర్పోర్ట్లోనే ఉంది. అయితే తాలిబన్లు కాబూల్లో కర్ఫ్యూ విధించడంతో భారత ఎంబసీ నుంచి వాళ్లను ఎయిర్పోర్ట్ వరకూ ఎలా తీసుకురావాలో అంతుబట్టడం లేదు. ఇండియన్ ఎంబసీలోని వారికి రక్షణగా వెళ్లిన 100 మంది ఐటీబీపీ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. ఇప్పటికే కాబూల్ ఎయిర్స్పేస్ను వాణిజ్య విమానాల కోసం మూసివేశారు.
విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమైన కేబినెట్ సెక్రటరీ ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన వారిని ఎలా వెనక్కి తీసుకురావాలన్నదానిపై ప్రణాళిక రచించనున్నారు. అయితే తాలిబన్లు కాబూల్కు రాకముందే వారిని ఎందుకు అక్కడి నుంచి తరిలించలేకపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశం నుంచి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్న వేల మంది ఆఫ్ఘన్ పౌరులు.. అక్కడి కాబూల్ ఎయిర్పోర్ట్కు పోటెత్తుతున్నారు. రన్వేపై కనిపించిన ప్రతి విమానం వెంటా పరుగులు పెడుతున్నారు. ఏ విమానం కనిపిస్తే అందులో ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు.. కాబూల్ ఎయిర్స్పేస్ను మూసివేశారు.