పోర్ట్ హార్కోర్ట్: నైజీరియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో (Oil Refinery) భారీ పేలుడు సంభవించింది. దీంతో వంద మందికిపైగా సజీవదహనం అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో.. నిర్వాహకులు, విక్రేతలు సమావేశమయ్యారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వందమందికి పైగా మరణించారని, మరికొందలు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని వెల్లడించారు. రివర్స్, ఇమో స్టేట్ మధ్య సరిహద్దులో ఈ ఘటన జరిగిందని రివర్స్ స్టేట్ పోలీస్ ప్రతినిధి గ్రేస్ ఇరింగే కోకో తెలిపారు.
ఆఫ్రికాలో భారీగా ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో నైజీరియాలో ఒకటి. అక్కడ రోజుకు సుమారు రెండు మిలియన్ బ్యారెల్స్ క్రూడాయిల్ ఉత్పత్తి అవుతుంది. అయితే నైజీరియాలో అక్రమంగా ముడిచమురును శుద్ధిచేయడం సర్వసాధారణం. పైప్లైన్లను ధ్వంసం చేసి ముడిచమురు దొంగిలించిన అనంతరం.. దానిని శుద్ధి చేసినతర్వాత బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తారు.