న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తున్నది. నవంబర్ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు.
వేగంగా విస్తరిస్తున్న వైరస్తో దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్లోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్లో కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత, ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు ఈ ఉత్పరివర్తనానికి వ్యతిరేకంగా మరింత రోగనిరోధక శక్తిని ఇస్తాయా? లేదా తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో భారీగా కేసులు
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కేసులు భారీగా పెరిగాయి. గత వారంతో ప్రస్తుతం కేసుల సంఖ్యను పోల్చి చూస్తే 700శాతం పెరిగాయి. గతవారం 2,300 కేసులు నమోదవగా.. ప్రస్తుతం 16వేలకుపైగా రికార్డవుతున్నాయి. ఇందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నిర్ధిష్టంగా తెలియకపోయినా.. 70శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నాయి.
ఒమిక్రాన్ కేసులు నమోదైన ప్రధాన దేశాలు
గత నెలాఖరులో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, సెనెగల్, బోట్స్వానా, మెక్సికో, భారత్, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఆస్ట్రియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జపాన్, ఫ్రాన్స్, ఘనా , దక్షిణ కొరియా, నైజీరియా, బ్రెజిల్, నార్వే, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, నమీబియా, నేపాల్, థాయిలాండ్, క్రొయేషియా, అర్జెంటీనా, శ్రీలంక, మలేషియాతో పాటు సింగపూర్లో కొత్త వేరియంట్ కేసులు రికార్డయ్యాయి.