కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనే ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. ఇప్పటి వరకూ అమెరికాలో మొత్తం 43 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ సోకిన ప్రజల్లో అధికభాగం.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారేనని యూఎస్ సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తెలియజేసింది.
ఒమిక్రాన్ సోకిన 40 మందిలో 30 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారున్నట్లు సీడీసీ గుర్తించింది. అంతేకాదు ఒమిక్రాన్ సోకిన పేషెంట్లలో 14 మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, సౌతాఫ్రికా సైంటిస్టులు తొలిగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించి ప్రపంచాన్ని హెచ్చరించారు.
ఆ తర్వాత ఈ వేరియంట్ చాలా దేశాలకు వ్యాపించింది. తాజాగా యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. దీంతో ఆ దేశంలో ఒమిక్రాన్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. మన భారత దేశంలో కూడా నలభై ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.