లండన్: షెల్ ఇంధన సంస్థ రికార్డు క్రియేట్ చేసింది. గడిచిన 115 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా .. 2022లో అత్యధిక స్థాయిలో లాభాలను ఆర్జించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో.. షెల్ కంపెనీ అనూహ్య రీతిలో ఇంధనం అమ్మినట్లు తెలుస్తోంది. 2022లో ఆ కంపెనీ ఏకంగా 40 బిలియన్ల డాలర్లు ఆర్జించిందని, అంతకముందు ఏడాదితో పోలిస్తే అది రెండింతలు అని, 115 ఏళ్ల కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక లాభాలు అని షెల్ పేర్కొన్నది.
ఉక్రెయిన్ వార్ తర్వాత ఇంధన సంస్థలన్నీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ లాక్డౌన్లు ఎత్తివేత మొదలైన తర్వాత.. గత ఏడాది మార్చి నుంచి ఇంధన ధరలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధన సరఫరాకు చాలా వరకు అంతరాయం ఏర్పడింది. ఓ దశలో బ్రెంట్ క్రూడాయిల్ 128 డాలర్లకు ఒక బ్యారెల్ చొప్పున అమ్ముడుపోయింది. కానీ ఆ తర్వాత బ్యారెల్ 83 డాలర్లకు పడిపోయింది. గ్యాస్ ధరలు కూడా పెరిగినా.. మళ్లీ ఆ తర్వాత తగ్గాయి.