వాషింగ్టన్, మే 5: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిషేధం విధించడంతో భారత సంతతికి చెందిన అనేక కుటుంబాలు తమ ఆప్తులకు దూరమై తల్లడిల్లుతున్నాయి. కుటుంబానికి ఆధారమైన కొంతమంది భారత్లోనే చిక్కుకుపోయారు. మరికొంత మంది తల్లులు తమ చిన్నారులకు దూరమయ్యారు. భారత్పై ట్రావెల్ బ్యాన్ మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులకు మాత్రం మినహాయింపులిచ్చారు. నిరవధికంగా నిషేధం విధించడంతో అది ఎప్పుడు ముగుస్తుందోనని భారత్లో చిక్కుకున్నవారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భారత్లోని అమెరికా కాన్సులేట్లు సైతం మూతపడ్డాయి. ‘నా భర్త హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారు. మా మామగారు చనిపోవడంతో అంత్యక్రియల కోసం నా భర్త గత నెల 17న భారత్కు వెళ్లారు. ఆయనకు హెచ్1బీ వీసా ఉన్నప్పటికీ, తిరిగి రావాలంటే పాస్పోర్ట్పై వీసా స్టాంపింగ్ అవసరం. అలాగే ఢిల్లీలో యూఎస్ మిషన్లో వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉన్నది. కానీ అమెరికా రాయబార కార్యాలయం మూసే ఉన్నది. ఈ సంక్షోభ సమయంలో ఇద్దరు పిల్లలతో నేను అమెరికాలోనే ఉండిపోయా’ అని స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ ఇన్ అమెరికా సహవ్యవస్థాపకులు నేహా మహాజన్ తెలిపారు. తన తొమ్మిది ఏండ్ల బాబు అమెరికాలో ఉన్నాడని, తాను మాత్రం ఇక్కడే చిక్కుకుపోయానని పాయల్ రాజ్ ఆవేదన వ్యక్తంచేశారు. ముంబైలోని అమెరికా కాన్సులేట్ను మూసివేయడంతో హెచ్1బీ వీసా స్టాంపింగ్ కుదరక తాను ఇండియాలోనే నిలిచిపోయాయని, తన పిల్లలు అమెరికాలో ఉన్నారని అభినవ్ అమ్రేశ్ పేర్కొన్నారు. వీసా స్టాంపింగ్ లేకపోతే తాను అమెరికా వెళ్లేందుకు వీలుపడదని చెప్పారు.