వాషింగ్టన్: చైనీయులు అబద్దాలకోరులని ఒకానొక సందర్భంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనతో చెప్పాడని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. మైక్ పాంపియో ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ద అమెరికా ఐ లవ్’ పేరుతో రాసుకున్న ఆత్మకథ మంగళవారం మార్కెట్లో విడుదలైంది. చైనీయులను కిమ్జోంగ్ ఉన్ అబద్దాలకోరులు అన్న విషయాన్ని పాంపియో తన పుస్తకంలో రాశారు.
అంతేకాదు, చైనా ఆధిపత్యం నుంచి తనకు రక్షణ కోసం పొరుగుదేశం దక్షిణకొరియాలో అమెరికా బలగాలు ఉండటం తనకు అవసరమని కూడా కిమ్ తనతో చెప్పినట్లు మైక్ పాంపియో తన ఆత్మకథలో పేర్కొన్నాడు. అమెరికా-ఉత్తరకొరియా సదస్సుకు మూడు నెలల ముందు 2018, మార్చి 30న తాను తొలిసారి ఉత్తరకొరియా పర్యటకు వెళ్లిన సందర్భంగా.. చైనా గురించి కిమ్ తన ఆందోళన వ్యక్తం చేసినట్లు పాంపియో తెలిపాడు.
దక్షిణకొరియా నుంచి అమెరికా బలగాలు తప్పుకోవాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బలంగా కోరుకుంటున్నట్లు చైనా తమకు పదేపదే చెబుతుందిగా అని తాను కిమ్ ముందు ప్రస్తావించానని, దాంతో కాసేపు పగలబడి నవ్వుతూ టేబుల్ను చరిచిన కిమ్ చైనీయులు పచ్చి అబద్దాలకోరులని వ్యాఖ్యానించాడని పాంపియో వెల్లడించారు.