సియోల్: ఉత్తర కొరియాలో మొదటిసారిగా బుధవారం ప్రయోగించిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం అయ్యింది. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగం పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాలలో తీవ్ర భయందోళనలు, గందరగోళ పరిస్థితులు సృష్టించింది. ఉదయం 6.27 గంటలకు ఉత్తర కొరియా రాకెట్ లాంఛర్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
అయితే తొలి రెండు దశలు కూడా పూర్తి కాకుండానే రాకెట్, ఉపగ్రహం వైఫల్యం చెందాయి. దీంతో కొరియా ద్వీపకల్పంలోని సముద్ర జలాల్లో వీటి శకలాలు కూలాయి. అయితే ఈ ఉపగ్రహ శకలాలు ఎక్కడ తమ మీద పడతాయేమోనని దక్షిణ కొరియా రాజధాని సియోల్కు చెందిన అధికారులు ఎటువంటి కారణం చెప్పకుండా నగరంలోని పౌరులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ వారి మొబైల్ ఫోన్లకు మెస్సేజ్లు పంపారు.