North Korea : ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా నిఘా విభాగం శత్రుదేశంపై మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఉత్తర కొరియా హ్యాకర్లు 1.2 బిలియన్ డాలర్ల వర్చువల్ సంపదను చోరీ చేశారని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది. 2017 నుంచి ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షల కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) విలువైన వర్చువల్ సంపదను కొట్టేశారని ఆరోపించింది. ఇందులో సగం డబ్బును ఈ ఏడాదిలోనే దొంగిలించారని నిఘా సంస్థ వెల్లడించింది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా తమ దేశానికి చెందిన ఆధునిక పరిజ్ఞానాన్ని చోరీ చేసేందుకు ఉత్తర కొరియా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడతారని చెప్పింది.
ఉత్తర కొరియా ఎప్పుడైనా అణ్వాయుధాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉందని దక్షిణ కొరియా ఈమధ్యే దక్షిణ కొరియా ఆరోపించింది. అందుకు కారణం.. ఉత్తర కొరియా జూలైలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. దాంతో అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య మాటల యుద్ధానికి తెర లేచింది. రెండు దేశాల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఎక్కువైంది.