ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా (North Korea) వరుసగా ఖండాంతర క్షిపణిలను పరీక్షిస్తున్నది. తన ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పొరుగు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. తాజాగా సాలిడ్ ఫ్యూయల్ ఖండాంతర క్షిపణిని (Solid-fuel ICBM) పరీక్షించింది. సరికొత్త హసంగ్-18 (Hwasung-18) ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ICBM)ను పరీక్షించినట్లు ప్రభుత్వ అధికారిక మీడియా కేసీఎన్ఏ (KCNA) న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ముందడుగు పడిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) పేర్కొన్నారు.
ప్యాంగ్యాంగ్ (Pyongyang) నుంచి 100 కిలోమీటర్ల మేర క్షిపణి వెళ్లినట్లు, మీడియం రేంజ్ అంతకన్నా ఎక్కువ రేంజ్ ఉన్న బాలిస్టిక్ క్షిపణిని లాప్టెడ్ ట్రాజెక్టరీలో ప్రయోగించినట్లు దక్షిణ కొరియా (South Korea) సైన్యం గుర్తించింది. కాగా, ఉత్తర కొరియా అణుక్షిపణులు అన్నీ దాదాపుగా ద్రవ ఇంధనంతోనే పనిచేస్తాయి. అయితే భూమి పై నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ఘన ఇంధన ఖండాంతర క్షిపణిని తయారు చేయాలని చాలా కాలంగా పట్టుదలతో ఉన్న కిమ్.. ఈ ప్రయోగంతో తాను అనుకున్నది సాధించినట్లయింది. ఈ తరహా క్షిపణులను రవాణా చేయడం, నిల్వ ఉంచడం సులభం. వీటిని తక్కువ సమయంలోనే వేగంగా ప్రయోగించడానికి సిద్ధం చేయవచ్చు. అదేవిధంగా వీటిని గుర్తించడం, విచ్ఛిన్నం చేయడానికి శత్రుదేశాలకు కొంత కష్టంతో కూడుకున్న పని అని నిపుణులు అంటున్నారు.