ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా విజయవంతంగా హైపర్సోనిక్ మిస్సైల్ను పరీక్షించింది. బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ ఏడాదిలో ఉత్తర కొరియా నిర్వహించిన మొదటి ఆయుధ పరీక్ష ఇదే. సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను హైపర్సోనిక్ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో చేరుకున్నట్లు కేఎన్సీఏ మీడియా తెలిపింది. ధ్వని వేగం కన్నా అధిక వేగంతో వెళ్లే హైపర్సోనిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించడం ఇది రెండవసారి. అయితే ఈ క్షిపణులు రేడార్ నిఘా నుంచి కూడా తప్పించుకోగలవు. రక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు ఇటీవల ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన తర్వాత ఈ పరీక్ష జరగడం విశేషం.
కొరియా ద్వీపకల్పంలో సైనిక వాతావరణం అస్థిరంగా ఉందని, ఈ నేపథ్యంలో రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు న్యూ ఇయర్ సందేశంలో కిమ్ తెలిపారు. అమెరికా, దక్షిణకొరియాతో విభేదాలు ఉన్నా.. గత ఏడాది పలు రకాల మిస్సైళ్లను ఉత్తరకొరియా పరీక్షించింది. అచితూ హైపర్సోనిక్ మిస్సైళ్లు ప్రస్తుతం కేవలం కొన్ని దేశాల వద్దే ఉన్నాయి. ఈ పరీక్షతో అమెరికా, చైనా లాంటి దేశాల సరసన ఉత్తరకొరియా నిలిచింది. నార్త్ కొరియా మిస్సైల్ను పరీక్షించినట్లు బుధవారం జపనీస్ కోస్టు గార్డులు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత దక్షిణ కొరియా మిలిటరీ దాన్ని ద్రువీకరించిన విషయం తెలిసిందే.
హైపర్సోనిక్ గ్లైడింగ్ మిస్సైల్..
నిన్న ఉత్తర కొరియా పరీక్షించించింది హైపర్సోనిక్ గ్లైడింగ్ మిస్సైల్. అంటే ఆ మిస్సైల్ పరీక్ష సమయంలో.. కొంత దూరం తర్వాత రాకెట్ బూస్టర్ నుంచి వార్హెడ్ విడిపోతుంది. ఇక టార్గెట్ వరకు ఆ వార్హెడ్ గ్లైడింగ్ చేస్తూ వెళ్తుంది. తాజా పరీక్షలో రాకెట్ బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత 120 కిలోమీ దూరం వరకు వార్హెడ్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఆ వార్హెడ్ చేరుకున్నది. ఫ్లయిట్ కంట్రోల్ సామర్ధ్యాన్ని కూడా మిస్సైల్ పరీక్ష ద్వారా గమనించారు. బాలిస్టిక్ మిస్సైళ్లతో పోలిస్తే, అతి తక్కువ ఎత్తులో హైపర్సోనిక్ మిస్సైళ్లు టార్గెట్ వద్దకు ప్రయాణిస్తాయి. ధ్వని వేగం కన్నా అయిదు రెట్ల అధిక వేగంతో .. అంటే గంటకు 6200 కిలోమీటర్ల వేగంతో ఆ క్షిపణి దూసుకువెళ్తుంది. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల.. హైపర్సోనిక్ మిస్సైళ్లు రేడార్లకు చిక్కవు.