ప్యోంగ్యాంగ్: ఈ ఏడాది ఆరంభం నుంచి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షిస్తున్న ఆ దేశం ఆదివారం కూడా ఓ భారీ పరీక్షను చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ అతిపెద్ద మిస్సైల్ పరీక్షకు చెందిన ఫోటోలను ఇవాళ ఉత్తరకొరియా అధికారిక మీడియా రిలీజ్ చేసింది. 2017 తర్వాత అతి పెద్ద పరీక్ష ఇదే అని చెప్పుకుంటున్న ఆ దేశం.. సముద్ర మట్టానికి సుమారు 2000 కిలోమీటర్ల ఎత్తు నుంచి మిస్సైల్ తీసిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కొరియా ద్వీపకల్పంతో పాటు సమీప ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మధ్యంతర శ్రేణికి చెందిన హాసాంగ్-12 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది.
నార్త్ కొరియా పరీక్షించిన క్షిపణి సుమారు 1242 మైళ్ల ఎత్తుకు చేరుకున్నట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. ఆ మిస్సైల్ జపాన్ సముద్ర జలాల్లో కూలినట్లు చెప్పాయి. ఆ రెండు దేశాలు ఉత్తర కొరియా నిర్వహించిన పరీక్షలను ఖండించాయి. కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ఈ నెలలోనే ఇప్పటికే ఏడు మిస్సైళ్లను పరీక్షించింది. అయితే ఆకాశం నుంచి మిస్సైల్ తీసిన తాజా ఫోటోలను కేసీఎన్ఏ ఏజెన్సీ రిలీజ్ చేసింది. మిస్సైల్ వార్హెడ్కు ఫిక్స్ చేసిన కెమెరా ఆ ఫోటోలను తీసినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
మిస్సైల్ లాంచింగ్కు సంబంధించిన రెండు ఫోటోలను కూడా ఆ దేశం రిలీజ్ చేసింది. సుమారు 30 నిమిషాల పాటు ఆ మిస్సైల్ 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్, సౌత్ కొరియా అధికారులు వెల్లడించారు. మరో వైపు ఉత్తర కొరియా నిర్వహించిన మిస్సైల్ పరీక్షలను యునైటెడ్ నేషన్స్ ఖండించింది.