సియోల్, సెప్టెంబర్ 29: ధ్వని కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే అత్యాధునిక హైపర్సానిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా బుధవారం వెల్లడించింది. దీనికి సంబంధించిన చిత్రాలను అక్కడి ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే ఈ తరహా క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టడం ఈ నెలలో ఇది మూడోసారి. కాగా, ఉత్తర కొరియా అణ్వాయుధాలను క్రమంగా పెంచుకుంటుండటంపై అమెరికా, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.