ప్యోంగ్యాంగ్: నార్త్ కొరియా ఇవాళ పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల(Ballistic Missiles)ను పరీక్షించింది. తూర్పు సముద్రంలోకి వాటిని విడుదల చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సమయంలో.. ఉత్తర కొరియా ఈ క్షిపణులను పరీక్షించినట్లు తెలుస్తోంది. రెండు నెలల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఉదయం 7.44 నిమిషాల నుంచి 8.22 నిమిషాల మధ్య ఫైరింగ్ జరిగినట్లు సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆప్ స్టాఫ్ తెలిపారు. ఆ మిస్సైల్స్ సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. ఆ తర్వాత అవి తూర్పు సముద్రం(సీ ఆఫ్ జపాన్)లో ల్యాండ్ అయ్యాయి.
ఉత్తర కొరియా కనీసం మూడు క్షిపణులను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. కేఎన్-24 మిస్సైల్స్ తరహాలో అవి ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు. కేఎన్-24.. సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిస్సైల్. అది సుమారు 410 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఆ మిస్సైల్ దాదాపు 500 కేజీల బరువున్న పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఉత్తర కొరియా నిర్వహించిన మిస్సైల్ పరీక్షలను జపాన్ ప్రధాని కిషిద ఖండించారు.