ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా తీరు మారడంలేదు. మరోసారి ఆ దేశం బాలిస్టిక్ మిస్సైల్ను పరీక్షించింది. జపాన్ తీరంలోకి ఆ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాతో పాటు జపాన్ సైన్యం సంయుక్తంగా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. నార్త్ కొరియా ఆగడాల గురించి చర్చించేందుకు సియోల్లో అమెరికా, జపాన్ దేశ ప్రతినిధులు భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం గమనార్హం. ఇటీవల ఉత్తర కొరియా వరుసపెట్టి క్షిపణులను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. హైపర్సోనిక్, లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లను ఆ దేశం పరీక్షించింది. వీటితో పాటు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఆయుధాలను కూడా పరీక్షించారు. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి ఉత్తర కొరియా ఆ పరీక్షలు చేపట్టుతున్నది. బాలిస్టిక్తో పాటు న్యూక్లియర్ వెపన్స్ను పరీక్షించరాదు అని ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి నిషేధ ఆంక్షలు ఉన్నాయి.
తూర్పు తీరంలో ఉన్న పోర్ట్ ఆఫ్ సిన్పో నుంచి ఇవాళ ఉత్తర కొరియా మిస్సైల్ను టెస్ట్ చేసినట్లు సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఉత్తర కొరియా జలాంతర్గాములకు పోర్ట్ ఆఫ్ సిన్పో కీలక అడ్డగా ఉంది. అయితే ఈస్ట్ సీగా పిలువబడే ప్రాంతంలో మిస్సైల్ పడినట్లు చెప్పారు. ఆ ప్రాంతాన్నే సీ ఆఫ్ జపాన్గా పిలుస్తారు. జపాన్ ప్రధాని పుమియో కిషిడా దీనిపై స్పందించారు. రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించారని, ఇది క్షమించరానిదన్నారు.