సియోల్: ఉత్తరకొరియాలో ఆహార పదార్థాలకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సరిహద్దుల్లో కరోనా ఆంక్షలు, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరదలు పోటెత్తి పంటలకు నష్టం వాటిల్లడం కారణంగా ఆహార సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం అక్కడ ఒక బ్లాక్ టీ ప్యాకెట్ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్ ధర రూ.7 వేలు, ఏడు అరటిపండ్ల (కిలో అరటిపండ్లు) ధర రూ.3 వేలకు పైనే పలుకుతున్నది.
ఉత్తరకొరియా రాజధాని ప్యాంగాంగ్లో పరిస్థితి మరింత దుర్బరంగా ఉన్నది. అక్కడ నిత్యావసర సరకుల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల కారణంగా పంట నష్టంతో ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తున్నది. దేశంలో ఆహార కొరత ఆందోళన కలిగిస్తోందంటూ తాజాగా అధినేత కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (FAO) కూడా అంచనా వేసింది. ఇది ఆ దేశానికి రెండు నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం. ఇక ఈ ఏడాది ఉత్తర కొరియా 13 లక్షల టన్నుల ఆహార కొరత ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేసింది. ఇలాంటి నివేదికల నేపథ్యంలో తాజాగా జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కిమ్.. దేశంలో ఆహార సరఫరా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా వెంటనే ఆహారోత్పత్తి గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించడం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొవిడ్ ఆంక్షలు మరికొంత కాలం కొనసాగించాలని అధినేత కిమ్ నిర్ణయించడం గమనార్హం.